గతంలో నేను ఓటు వేయాల్సి వచ్చినప్పుడు చాలా భాద పడ్డాను. ఎందుకంటే అప్పుడు రెండే పార్టీలు...నిలబడ్డ అభ్యర్దులు ఎదవలు అని తెలిసిన కూడా తప్పకుండా ఎవడో వెధవని ఎన్నుకోవాలి. అయ్యో...ఎవరికీ వెయ్యకుండా అభ్యర్దులు నచ్చలేదు అని చెప్పే ఆప్షన్ ఉంటే బావుండేదే...అని నాలో నేను ఒక వంద సార్లు అనుకుని ఉంటాను. అలా అనాసక్తి, అసంతృప్తి ఉన్నప్పటికీ ఓటు వెయ్యాలి అన్న స్పృహ ఉండటంతో తప్పనిసరై ఒక వెధవకి ఓటు వెయ్యాల్సి వచ్చింది. ఇది గతం..
ఒకసారి టీవీలో యువ సినిమా చూస్తున్నాను. అందులో పీ.హెచ్.డీ చదువుతున్న సూర్య రాజకీయాల్లో మార్పు తేవటానికి కృషి చేస్తుంటాడు. తనతో పాటు కొంతమంది సహ విద్యార్దులు కూడా తన అడుగుజాడల్లో నడుస్తుంటారు. ఎన్నికల్లో కొంత మందిని నిలబెడతాడు. అయితే ఫలితాలు వచ్చినప్పుడు సూర్యతో పాటు ఎన్నికల బరిలో నిలబడ్డ సహ విద్యార్దులు అతని దగ్గరకు వచ్చి మనం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటారు. అప్పుడు సూర్య ఇలా అంటాడు...."ఏం పరవాలేదు...మనం ఎవరిమో..ఎందుకోసం ఎన్నికల్లో నిలబడ్డామో ప్రజలకు మరింత వివరంగా తెలియజేద్దాం..మళ్లీ వచ్చే ఎన్నికల్లో నిలబెడదాం..". నిజానికి ఆ ఎన్నికల్లో వారి టీంలో వారందరూ గెలుస్తారు.
ఆ సీన్ చూసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. రాజకీయాల్లోకి ఇలా మంచి చదువుకున్న, జనం గురించి ఆలోచించే మేధావులు వస్తే ఎంతో బావుంటుంది అని అనిపించింది. కాని అది సినిమా కాబట్టి అలా జరిగిందిలే అని సరి పెట్టుకున్నాను. కాని ఆ ఊహ నాకు చాలా బాగా నచ్చేది.
ఈసారి జే.పీ గారు ఎన్నికల్లో నిలబెడతారు అని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఓటు వేస్తానా అని నెలల ముందు నుండి ఆరాటపడ్డాను. ఇంతకు ముందు నుండే ఆయన శైలి నాకు బాగా నచ్చేది. ఈ టీవి లో గతంలో ప్రతిధ్వని అని చర్చా కార్యక్రమం వచ్చేది. అందులో జే.పీ. గారే వ్యాఖ్యాత. ఎప్పుడూ చర్చ కార్యక్రమాలు చూడని నేను అతని వ్యాఖ్యానాలు కోసం రెగ్యులర్గా ఫాలో అయిపోయేవాడిని. ఆతర్వాత అతని గురించి మరింత సమాచారం సంపాదించి చదివిన తర్వాత పెద్ద ఫాన్ అయిపోయాను. గతంలో నేను ఒక రాజకీయ నాయకుడను ఇష్టపడటం అనేది ఒక పెద్ద జోక్ నాకు.
ఇప్పుడు నా అస్త్రాన్ని వాడుకునే టైం వచ్చింది. ముందునుండే ఎవరికీ వెయ్యాలో క్లారిటీ ఉండటంతో చాలా సంతృప్తిగా ఓటు వేసి వచ్చాను. గతంలో ఎంత అసంతృప్తిగా వేసానో ఇప్పటికీ గుర్తుంది. దాని స్థానంలో ఇప్పుడు వోటు వేసిన సంతృప్తి పాత అసంతృప్తిని పూర్తిగా తుడిచిపెట్టేసింది.
ఒక కలయిక
6 రోజుల క్రితం